బాన్సువాడ , బతుకమ్మ : గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కువగానే ధాన్యం సేకరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తన ఇంట్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్లపై అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని,ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. సకాలంలో నియోజకవర్గ రైతాంగానికి నీరు అందించడంతో అధిక దిగుబడిని సాధించారన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ల తో పాటు రైస్ మిల్లర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని, సమస్యలపై చర్చిస్తూ విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తోందన్నారు. సమావేశంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, వెంకన్న, నర్సింలు శ్రీనివాసరెడ్డి, దాసరి శ్రీనివాస్, ఉదయ్, హకీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.