Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:46 pm Posted by : ramakrishna

దివ్యాంగులకు సౌకర్యాలను మెరుగుపరచాలి

 

. . . ఎంపీ ధర్మపురి అర్వింద్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

దివ్యాంగులకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటు సౌకర్యాలను మెరుగుపరచాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను బుధవారం న్యూఢిల్లీలో ఆయన కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయాల్సిన అవసరాన్ని ఎంపీ వివరించారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం నిర్వహించే అంచనా శిబిరాలను మరింత విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని అర్వింద్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి సహకరిస్తున్న కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అర్వింద్ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి డా. వీరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.