Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 11:23 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

  • మున్సిపల్ కమిషనర్ శ్రీహరి

 

బాన్సువాడ, బతుకమ్మ : రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. బాన్సువాడ మున్సిపాలిటీ సమీపంలో ఎండిపోయిన బోర్ వద్ద బోర్ చుట్టూ ఇంకుడు గుంతను ఏర్పాటు పనులను మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. రోజు రోజుకి నీటి అవసరాలు పెరుగుతుండడంతో ప్రజలు బోరు మోటర్ల పై ఆధారపడుతున్నారని అన్నారు.ఈ బోరు మోటర్ రీఛార్జి కావాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి మున్సిపాలిటీ తరపున అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకుడు గుంతల వల్ల వృధాగా పోయే వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించి భూగర్భ జలాలను పెంపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, తుల శ్రీనివాస్, విట్టల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.