Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 5:44 pm Posted by : ramakrishna

దేశభక్తి విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

 

. . . ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మహ్మద్ షకీల్ అహ్మద్ ఫాజిల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశభక్తి, ఐక్యత, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మహ్మద్ షకీల్ అహ్మద్ ఫాజిల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ బోధన్‌ రోడ్‌లోని 34వ డివిజన్‌లో మాదిగ సంఘం ఆధ్వర్యంలో జాతీయ త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. మాదిగ సంఘం అధ్యక్షులు టి. హరికృష్ణ, 34వ డివిజన్ ఎంఐఎం పార్టీ ఇన్‌చార్జి టి. భాగ్యలక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి అహ్మద్ ఫాజిల్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాదిగ సంఘం ప్రతినిధులు, మహిళా మండలి సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం మహ్మద్ షకీల్ అహ్మద్ ఫాజిల్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ముందుగా అందజేయలేకపోయినా, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సంబంధిత నోటీసులు అందిన వెంటనే ప్రజలు తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలను సమకూర్చి అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సమస్యలు ఎదురైన సందర్భంలో వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. 34వ డివిజన్ ఎంఐఎం పార్టీ ఇన్‌చార్జి టి.భాగ్యలక్ష్మి డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని షకీల్ అహ్మద్ ఫాజిల్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ఎంఐఎం పార్టీ నాయకులు, ప్రతినిధులు అండగా ఉంటారని ఆయన తెలిపారు. డివిజన్‌లో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి. బాబు, పల్లె సాయికుమార్, మహేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాదిగ సంఘం ప్రతినిధులు, మహిళా మండలి సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.