. . . యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది
. . . సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక శాపమని, వాటి నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. జూన్ 22 నుండి జూన్ 26 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా బోధన్ లోని మాడల్ హై స్కూల్ లో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూన్ 26 న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదకద్రవ్యాల నిర్మూలన కి సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. లేదా డయల్ ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908కు సంప్రదించాలన్నారు.

సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో నిజామాబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ” సే నో టూ డ్రగ్స్ , సే ఎస్ టూ లైఫ్ ” అని పిలుపునిచ్చారు. యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తం అవసరం అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. జిల్లాలో 60% ప్రమాదాలు ఇంటర్నల్ రోడ్ల లో, 40% ప్రమాదాలు జాతీయ రహదారిలో అవుతున్నాయన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి సమాజంలో అవగాహన కల్పించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పోలీస్ కమీషనర్ పిలుపునిచ్చారు. జూన్ 22 నుంచి 26 వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్ సోల్జర్’ సెల్ఫీ పాయింట్ ను ప్రారంభించి, యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రగ్స్ కు సంబంధించిన డ్రాయింగ్, వ్యాసరచన పోటీలో గెలుపొందిన సాత్విక, శ్రీ నిధి, శ్రీజల్, పాటిల్ శృతి, అక్షర, కోయల్ శ్రీ విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎ సి పి శ్రీనివాస్, బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్, విద్యా వికాస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ శ్రీనివాస్, ట్రాస్మా చైర్మన్ హరికృష్ణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
