. . . మేనిఫెస్టోలో పెట్టిన జీవోను అమలు చేసి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమంలో ఊరూర తిరిగి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన అర్హులైన కళాకారులకు సారధిలో ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ కళాకారుల జిల్లా అధ్యక్షుడు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి మహేందర్, కోశాధికారి రమేష్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వెయ్యి రోజులు పూర్తి అయిన కళాకారులకు ఉద్యోగాల కల నెరవరేలేదన్నారు. శాసనసభలో కళాకారుల పై కపట ప్రేమను చూపుతూ మాట్లాడిన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.సాంస్కృతిక సారధిలో ఉద్యోగాల కోసం మేనిఫెస్టోలో పెట్టిన జీవోను వెంటనే అమలు పరచాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా కార్యచరణ రూపొందించాలని, లేనిపక్షంలో 33 జిల్లాల కళాకారులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతమన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా అర్హులైన కళాకారులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.కళాకారుల జీవితాలు ఎంతో దుర్భరంగా మారాయన్నారు. ఆనాడు ఉద్యమం కోసం చేస్తున్న ఉద్యోగాలు పనులు వదిలేసి ఉద్యమించామని, ఈనాడు ఉపాధి లేక ఇల్లు గడవని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కళాకారులు అందరికీ న్యాయం చేస్తామని ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం 550 మందికి సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారనీ, అసలైన అర్హులైన నిజమైన కళాకారులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా అర్హులను గుర్తించి ఉద్యోగాలు కల్పించి,మా కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఎన్నికల్లో కళాకారులను ఆదుకుంటామని వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందనీ, గాంధీభవన్ లో మేనిఫెస్టోలో కూడా పెట్టారని,ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంతోమంది ఎమ్మెల్యేలను మంత్రులను అధికారులను కలిసిన లాభం లేకుండా పోయిందనీ, ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నాయకులు అర్హులైన కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరారు.నిన్న జరిగిన శాసనసభలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కళాకారులను ఆదుకుంటామని కాలయాపన మాటలు మాట్లాడారు తప్ప, కళాకారుల బతుకుల లో వెలుగులు నింపాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తుందన్నారు. ప్రభుత్వం కళాకారులను ఆదుకోకుంటే తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాలోని కళాకారులను కలుపుకొని రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.