మోపాల్, బతుకమ్మ :
ఇందూరు తిరుమల క్షేత్రంలో సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించే పలు విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాలు సోమవారం వైభవంగా నిర్వహించామని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి తెలిపారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించి, అనంతరం శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సమస్త లోకం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించారు.

అలాగే వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా భావించే “ఏరువాక పూర్ణిమ” కార్యక్రమాన్ని కూడా ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి సస్యశ్యామలం కావాలని, రైతాంగానికి మంచి పంటలు పండాలని ప్రార్థిస్తూ ఎద్దులు, నాగళ్లు, ఇతర వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి, సుజాత దంపతులతో పాటు నర్సారెడ్డి, నరాల సుధాకర్, భాస్కర్, రాములు, గంగారెడ్డి, రాజేశ్వర్, సాయిరెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలన్నింటినీ వేద పండితులు సంపత్ కుమార్ ఆచార్య, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్య, సాంబమూర్తి తదితరులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
