Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:38 pm Posted by : ramakrishna

మరణానంతరం ఇద్దరికి కంటిచూపునిచ్చిన ఎనిమిరెడ్డి జ్యోతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మరణానంతరం తన కళ్లను దానం చేసి మరో ఇద్దరికి కంటిచూపు ప్రసాదించిన కాలేపల్లి క్యాంపునకు చెందిన ఎనిమిరెడ్డి జ్యోతి ఆదర్శంగా నిలిచారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నిజామాబాద్ జిల్లా నాయకుడు ఎనిమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్య అయిన జ్యోతి కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ, నిజామాబాద్‌లోని ప్రగతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. జ్యోతి మరణానంతరం తన కళ్లను దానం చేయాలనే కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పార్టీ నాయకుల సమక్షంలో లయన్స్ క్లబ్ ద్వారా కళ్లను సేకరించి సంబంధిత సంస్థలకు అప్పగించారు. ఆమె కళ్లదానం ద్వారా ఇద్దరికి కంటిచూపు లభించే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ, జ్యోతి విప్లవోద్యమానికి అనేక విధాలుగా సహకరించారని గుర్తుచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి రైతు కూలీ సంఘంలో పనిచేయడానికి జ్యోతి అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. మరణంలో కూడా సమాజ హితం కోరుతూ కళ్లదానం చేసిన జ్యోతి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతి భర్త శ్రీనివాస్ రెడ్డి, కుమారుడు శివ తేజ రెడ్డి, కుమార్తె హంసికతో పాటు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్, నగర కార్యదర్శి నీలం సాయిబాబా, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పూర్ భూమయ్య, దేశెట్టి సాయిరెడ్డి, నాయకులు వేములపల్లి అరుణ, పిట్ల సరిత, సూర్య శివాజీ, జేపీ గంగాధర్, డి. బన్సీ, అగ్గు ఎర్రన్న చిన్నయ్య, డి. గంగాధర్, గోపాల్, గొంట్యాల రమేష్, డి. మల్లికార్జున్, శివ, నీలం లక్ష్మి, సంజన, భారతి, నరసయ్య, సాయిలు, అనంతయ్య, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

 

Enimireddy Jyothi gave eyesight to two people after her death.