Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 1:02 pm Posted by : ramakrishna

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించాలి

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి పలు ఆక్రమణలను కలెక్టర్ గమనించారు. వెంటనే వాటిని తొలగించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రదేశాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో స్థలం అందుబాటులో ఉంది, రాకపోకలకు అనువుగా రోడ్డు మార్గం ఉందా అని తెలుసుకున్నారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, తహసీల్దార్ బాలరాజు, సంబంధిత అధికారులు ఉన్నారు.


Encroachment of government places should be removed