- పది మంది నక్సల్స్ హతం
- అనతి కాలంలోనే ఉద్యమం కనుమరుగు
నిజామాబాద్, బతుకమ్మ: మావోయిస్టుల ఉద్యమ ఖిల్లా మానాలలో ఎన్కౌంటర్ జరిగి 20 ఏళ్ళు పూర్తి అవుతోంది. అప్పట్లో కమ్మర్ పల్లి మండలం (ప్రస్తుతం రుద్రంగి మండలం) మానాల శివారులో గల జోత్యానాయక్ తండా సమీపంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి, నక్సలైట్లకు మద్య 2004లో చర్చలు జరిగిన మరు క్షణమే, రాష్ట్రంలో అతి పెద్ద ఎన్కౌంటర్ మానాలలో జరగడం సంచలనంగా మారింది. ఎన్కౌంటర్ కు ముందు పోలీసులు జరిపిన కూంబింగ్ లో ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరు కోవర్టులుగా మారడంతోనే మానాలలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తాయి. ఎన్కౌంటర్ కు ముందు ఉద్యమం దశాబ్దాలపాటు బలమైన శక్తిగా అవతరించింది. గ్రామాలలో ఉన్న సమస్యలు నక్సలైట్ల దగ్గరికి వెళ్ళడంతో అన్నల పాలనగా పిలిచేవారు.
- రక్తపు మడుగులో ..
కరీంనగర్ జిల్లా పశ్చిమ డివిజన్ బృందం కార్యదర్శి వెంకటస్వామి అలియాస్ రమేశ్ తో పాటు 10 మంది నక్సల్స్ మానాల గుట్టపై అమరులయ్యారు. దళ నేతలు కామిండ్ల శోభ, రఘు, సభ్యులు జ్యోతి అలియాస్ స్నేహ, గోవర్ధన్, కిషన్ రెడ్డి అలియాస్ శంకర్, రవి అలియాస్ శ్రీనివాస్, సునీత అలియాస్ పద్మ, కొమ్ము బాబు అలియాస్ బాబన్న, రమేష్ అలియాస్ సుధీర్ లు ప్రాణాలు విడవడంతో ఆ ప్రాంతమంత రక్తం ఏరులై పారింది. బూటకపు ఎన్కౌంటర్ అని అమరులైన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, పోస్ట్ మార్టం సమయంలో వీడియో చిత్రీకరించాలని ఆదేశించింది. మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం ఎన్ కౌంటర్ తో ముగియడంతో, నక్సలైట్ ఉద్యమానికి చిహ్నంగా మహిళా అమర వీరుల స్మారక స్తూపాన్ని మానాలలో నిర్మించారు. ఎన్కౌంటర్ జరిగిన అనంతరం రెండు దశబ్దాలలో ఉద్యమం కనుమరుగయ్యింది.
