- జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ విద్యా వ్యవస్థలో వృత్తి విద్య కోర్సుల ద్వారా విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను త్వరగా పొంది జీవితంలో స్థిరపడుతున్నారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. గురువారం నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వృత్తి విద్యా కోర్సుల అభ్యసిస్తున్న విద్యార్థినులు, మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోడానికి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు నెలలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి సూచించారు. బాలికల కళాశాల మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ లాబ్ టెక్నీషియన్ విద్యార్థినులు ప్రభుత్వ ఆస్పత్రిలో పొందుతున్న శిక్షణ, వారు చేస్తున్న సేవలను ఇంటర్ విద్యా అధికారి స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులు అధ్యాపకులు, ఆస్పత్రి సిబ్బంది ఇస్తున్న శిక్షణను శ్రద్ధగా వింటూ శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. బాలుర కళాశాల కంప్యూటర్ కోర్స్ విద్యార్థులు పొందుతున్న శిక్షణ ను పర్యవేక్షించారు. నిర్లక్ష్యం గా వ్యవహరించకుండా విద్యార్థులు తమ వృత్తి నైపుణ్య శిక్షణ సమర్ధవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజ్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఖాలీక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
