బతుకమ్మ : నాగిరెడ్డిపేట :
నాగిరెడ్డి పేట్ మండలంలోని మహిమాన్విత శైవక్షేత్రమైన త్రిలింగ రామేశ్వర దేవాలయాన్ని బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇంతటి పుణ్యక్షేత్రంలో పూజలను చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు ఆలయ కమిటీ తరఫున శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం ఇచ్చారు.. ఇంతటి మారుమూల ప్రాంతమైన మంజీరా నది తీరంలో వెలసిన ఈ క్షేత్రం దిన దిన ప్రవృద్ధమానవుతుందని ప్రతి ఏడు భక్తుల సంఖ్య పెరుగుతుందని, త్వరలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పండగ సందర్భంగా త్రిలింగ రామేశ్వరాలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో ఉపవాస దీక్షలు విరమించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్మ దత్తు, భక్తులు పాల్గొన్నారు.
