నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ లో ప్రజానాట్య మండలి నగర ఏరియా కమిటీని గురువారం ఎన్నకున్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం మాట్లాడుతూ ప్రజానాట్యమండలి 1943 లో ఏర్పడి ఈనాటికి 80 సంవత్సరాలు దాటిందన్నారు. ఈ నాట్యమండలి నుండి అనేక కళారూపాలు సామాజిక రుగ్మతలపై నాటికలు వీధి నాటికలు ప్రదర్శించారని తెలిపారు. అక్షరాస్యత, సారా ఉద్యమం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇలాంటి కార్యక్రమాల్ని తీసుకొని ప్రజల మధ్యకు కళారూపాన్ని తీసుకువెళ్లిందని తెలిపారు. 23న జరిగే జిల్లా మహాసభను ప్రజలు కళాకారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర ఏరియా కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు సుదర్శన్, అధ్యక్షులు విజయ మాల, ఉపాధ్యక్షులు గంగన్న, ప్రధాన కార్యదర్శి ఎం నర్సారెడ్డి, సహాయ కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్, కోశాధికారి ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.