రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ట్యాంక్ బండ్ వద్ద ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : చరిత్రలో నిలిచిపోయే త్యాగం చేసిన ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో కవిత పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఏకలవ్యుడి చిత్రపటానికి నివాళులర్పించారు. ఏకలవ్యుడు భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్యుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేయని దారుణ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజిక వర్గానికి అన్ని పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాలని కోరారు. రూ. 500 కోట్లతో తక్షణమే ఎరుకల కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బహుజనుల పట్ల ఏ విధంగా అణిచివేత ఉందో చెప్పడానికి ఏకలవ్యుడి జీవితమే ఒక ఉదాహరణ అన్నారు. బహుజనలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలన్న ఉద్యమంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
