- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
సదాశివనగర్, బతుకమ్మ : సాగునీరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ ను గురువారం ఆయన పరిశీలించిన ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేసానని తెలిపారు. తక్షణమే 23 కోట్లు మంజూరైతే 14500 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అని అధికారులు చెప్పారని, ప్రాజెక్టు పనులపై రెండుసార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావించానని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పలు దఫాలుగా కలిసి విన్నవించానని, కాటేవాడి, ధర్మారావుపేట, మోతె రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. గాంధారి మండలంలో 13546 ఎకరాలు, సదాశివనగర్ 24590, రామారెడ్డి 8664, తాడ్వాయి 20220, రాజంపేట 2593, లింగంపేట 22934, ఎల్లారెడ్డి 3200, నాగిరెడ్డిపేట మండలంలో 3100 ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ 7 ద్వారా 11.5 టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందనిచ, లక్ష ఎకరాలకు సాగునీరు వస్తే ధనిక రైతుల నియోజకవర్గంగా మారుతుందని, చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ఇదని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. పోచారం ప్రాజెక్టు మట్టితో కూడుకుపోయిందని, దీనిపై మంత్రితో మాట్లాడుతున్నానని తెలిపారు. 5 వేల మంది రైతులతో సీఎంను కలిసి ఫైనాన్స్ అప్రూవల్ తెస్తానన్నారు. 23 కోట్ల రూపాయల విడుదల కోసం 2024 జులై 1 న మంత్రి ఉత్తమ్ కు వినతిపత్రం అందించానని.. మొత్తం వివరాలు వెల్లడించానని తెలిపారు. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించానని ఫలితంగానే 23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 3 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు.
