హైదరాబాద్, బతుకమ్మ : విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును జయించవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చన్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి అందజేశారు. 320 మందికి ఉద్యోగ నియమాకాల పత్రాల అందజేత కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. సీఎఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామన్నారు. రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలో అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 2,600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నామన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో వెళ్తుందన్నారు.