. . .భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు
. . . రిక్టర్ స్కేల్ పై 4.5 గా నమోదు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడం, వింత శబ్దాలు రావడం తో ఏం జరుగుతుందో తెలియక జనం ఉలిక్కిపడి లేచారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు సమాచారం. భూ ప్రకంపణల కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. కాకినాడ తూర్పున సుమారు 227 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 275 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భూకంపం కేంద్ర బిందువుగా గుర్తించారు. భూ ప్రకంపనలకు విశాఖపట్నంలో గాజువాక, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఆర్లోవా ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ప్రకంపనలు కొద్ది సెకన్లపాటు ఉండటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
