బతుకమ్మ, బోధన్ : బోధన్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై ఉన్నతాధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), బోధన్ సబ్ కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ సిబ్బంది డంపింగ్యార్డ్ను సందర్శించారు. ఈ సందర్భంగా అంతర్గత రహదారుల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ ప్రక్రియను తక్షణం ప్రారంభించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. షక్కర్నగర్ రోడ్డుపై తాగునీటి పైపులైన్ల లీకేజీల సరిదిద్దే పనులను పరిశీలిస్తూ, పనులను శాశ్వతంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. తరువాత మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు వాటర్ ట్యాప్ ఛార్జీ రసీదులను క్యాష్బుక్ తో పోల్చి పరిశీలించారు. రసీదుల వివరాలను సమయానికి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని రెవెన్యూ విభాగానికి సూచించారు. వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లపై చర్చించారు. వసూళ్లలో ఉదాసీనత కనబరుస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఈ దర్యాప్తు పర్యటనతో మున్సిపాలిటీలో క్రమశిక్షణ పెరగనున్నదంటే సందేహం లేదని స్థానికులు అభిప్రాయపడ్డారు.
