నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సీ.పీ (అడ్మిన్) జి.బస్వరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీపాదరావు ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వరెడ్డి మాట్లాడారు. ఆయన మూడుసార్లు శాసనసభ సభ్యులుగా ఎన్నికై, శాసనసభ స్పీకర్ గా పని చేశారని తెలిపారు. ఆయన ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే వారన్నారు. 1999 ఏప్రిల్ 13 సంవత్సరంలో మహాదేవపూర్ మండలం అన్నారం కు తన అనుచర వర్గంతో వెళ్ళి వస్తున్న సమయంలో మార్గమధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సలైట్లు ఆపి ఆయనతో మాట్లాడాలని చెప్పి, లోపలికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారని తెలిపారు. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకుడిని నిష్కారణంగా హతమార్చిన మావోయిస్టులపై విమర్శలు గుప్పుమన్నాయన్నారు. ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పీ (ఏ.ఆర్) రాంచందర్ రావు, ఆఫీసు సూపరింటెండెంట్ శంకర్ , ఆర్ఐ (వెల్ఫేర్) శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి. ఆర్.బి సి.ఐ సతీష్, సిబ్బంది, సి.ఎస్బి , ఆర్.ఎస్.ఐ నిషిత్, ఐటి కోర్, పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కంప్లెంట్ సెల్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
