Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 5:20 pm Posted by : ramakrishna

కోడి పందాలపై డ్రోన్ కెమెరా నిఘా

బోధన్, బతుకమ్మ :

 

నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో కోడి పందాలు, జూదం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ జరుతున్నట్లు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. బోధన్ ఏసీపీ పర్యవేక్షణలో, రుద్రూర్ సీఐ మార్గదర్శకత్వంలో వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని జలాల్‌పూర్, కోటయ్య క్యాంప్, శ్రీనగర్, నెహ్రూ నగర్, హుమ్నాపూర్, జాకోరా గ్రామాల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలు, జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందడంతో డ్రోన్ కెమెరా ద్వారా నిఘా నిర్వహించబడుతోందని, డ్రోన్ నిఘా ప్రారంభమైనప్పటి నుండి ప్రజల నుంచి మంచి సహకారం, సానుకూల స్పందన లభిస్తోందన్నారు. ఈ చర్యలతో అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేవారిలో భయం ఏర్పడిందని, కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, జూద కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని, ప్రజలు ఎవరైనా కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని లేదా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని కోరారు.