. . . పోలీసులకు చిక్కిన ఇంటి దొంగ
. . . 48 గంటల్లో కేసు ఛేదించి, నగలను స్వాధీనం చేసుకున్న భిక్కనూర్ పోలీసులు
కామారెడ్డి, బతుకమ్మ :
‘దృశ్యం’ సినిమా తరహాలో దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ఓ మహిళా నిందితురాలిని భిక్కనూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు నమోదైన రెండు రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేసి, చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్ల స్వామి ఇంట్లో ఈనెల 16న చోరీ జరిగింది. స్వామి దంపతులు బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో భద్రపరిచిన 6 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీకి పాల్పడిన నిందితురాలు దొడ్లె లత, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు తాను ఆ సమయంలో కామారెడ్డిలో ఉన్నానని, అందుకు సంబంధించిన బస్సు టికెట్లు, షాపింగ్ బిల్లులను చూపిస్తూ ‘దృశ్యం’ సినిమా తరహాలో పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో, భిక్నూర్ సీఐ జె. నరేష్ నేతృత్వంలోని బృందం శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి, నిందితురాలి అబద్ధాలను బయటపెట్టింది. నిందితురాలిని అరెస్ట్ చేసి, సొత్తును పూర్తిగా రికవరీ చేసిన సీఐ నరేష్, ఎస్ఐ అనిల్, ఏఎస్ఐ వెంకటరావు, సిబ్బంది శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు.