Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 1:00 pm Posted by : ramakrishna

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి

 

.  .  .  ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి జలాలు సరఫరా జరగాలి

 

.  .  .  అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

ఆర్మూర్, బతుకమ్మ  :

 

వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏ.ఈలు, ఎం.పీ.ఓ లు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా తీరుతెన్నులపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతు పనులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వేసవిలో ఏయే ప్రాంతాలలో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున, తాగునీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా చూడాలని, చివరి ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలలోని నివాసాలకు సైతం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సకాలంలో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని అన్నారు. ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి నెలకొనకుండా అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటి కోసం ప్రజలు నిరసనకు దిగితే, సంబంధిత ఎం.పీ.డీ.ఓలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకుని, ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డులలో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలని అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్ లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్ లకు నష్టం చేకూర్చే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీఓలు, ఏ.ఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్.ఈ రాజేందర్, డీపీఓ శ్రీనివాస్ రావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భగీరథ ఈ.ఈ రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఏ.ఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Drinking water supply should be constantly monitored
Drinking water supply should be constantly monitored