Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 9:13 pm Posted by : ramakrishna

వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీల మరమ్మత్తులు చేపట్టాలి

 

. . . మున్సిపల్ అధికారులకు బీజేపీ కౌన్సిలర్ల వినతి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల మరమ్మత్తులు, పూడిక తొలగింపు, చెత్త శుభ్రపరిచే పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్ల బృందం ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న టీపీఓకు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, గత వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న డ్రైనేజీలను మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లపైకి నీరు చేరకుండా పెద్ద డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించాలని కోరారు. అలాగే డ్రైనేజీల చుట్టూ పెరిగిన గడ్డి, చెత్తను తొలగించి ప్రతి డ్రైనేజీని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం చేపట్టి వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని, నివారణ చర్యలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను కోరారు. వర్షాకాలానికి ముందే డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహిస్తే వరద ముప్పును తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించవచ్చని కౌన్సిలర్లు పేర్కొన్నారు.