Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 9:06 pm Posted by : ramakrishna

డీసీసీ పీఠం కోసం డజన్నర  మంది దరఖాస్తు 

  • పీసీసీ అధ్యక్షుని సొంత జిల్లాలో తీవ్రపోటీ
  • డీసీసీ పీఠం కోసం సీనియర్ల పట్టు    
  • ఇందూరులో కాంగ్రెస్ పదవుల కోసం సర్వత్రా ఆసక్తి 

 

నిజామాబాద్, బతుకమ్మ :  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  సొంత జిల్లాలో డీసీసీ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్నదానిపై  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీసీసీ పీఠం కోసం 18 మంది దరఖాస్తు చేసుకోగా  ఏఐసీసీ పరిశీలకులు నియోజకవర్గాల వారిగా అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. బీసీ వర్సెస్ రెడ్డీ అన్నట్లుగా పోటీ ఉంది. అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తిగా మారింది.

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో డీసీసీ పగ్గాలు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తిగా మారింది. పార్టీ నాయకత్వం ఆలోచన ఏ విధంగా ఉంటుందనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.  డీసీసీ పీఠం కోసం సీనియర్లు దరఖాస్తులు చేసుకున్నారు. అంకాపూర్ కు చెందిన సీనియర్ నేత మార చంద్రమోహన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పీసీసీ అధికార  ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ లు రేసులో ముందు వరుసలో ఉన్నారు.

Dozens apply for DCC seat

డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక కు ఈ సారి కార్యకర్తల ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారిగా అభిప్రాయ సేకరణ పూర్తి చేసి నివేదిక పీసీసీకి  ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న నాయకులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో కాంగ్రెస్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు  నగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్ పేర్లు సూచించారు. మిగతా నియోజకవర్గాల్లో మారా చంద్రమోహన్,వేణుగోపాల్  పేరు వినిపిస్తుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సారి సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ తీవ్రంగా ఉంది. ఈ పదవి కోసం అర డజన్ మంది దరఖాస్తులు చేసుకోగా రేసులో సీనియర్ నేత నరాల రత్నాకర్, కాపు కర్ ఘన్ రాజ్, బొబ్బిలి రామకృష్ణ, కౌడపు శరత్ కుమార్ బీసీ కోటాలో ముందున్నారు. మైనార్టీ కోటాలో జావిద్ అక్రమ్, కరీముద్దిన్ సిటీ కాంగ్రెస్ పీఠం ఆశిస్తున్నారు. డీసీసీ పీఠం బీసీకి ఇస్తే, సీటీ కాంగ్రెస్ పీఠం ఓసీకి ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లా ముఖ్య నేతలతో పాటు బోధన్, ఆర్మూర్ బాల్కొండ, రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ పూర్తయింది.