Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 5:43 pm Posted by : ramakrishna

మార్కెట్ కమిటీ చైర్మన్ డౌన్ డౌన్

 

. . . గాంధీగంజ్ లో పండ్ల వ్యాపారుల ఆందోళన

 

. . . వ్యాపారులకు మద్దతు పలికిన మజ్లీస్ పార్టీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని గాంధీ గంజ్ (గడియారం గంజ్) లో పండ్ల వ్యాపారులు ఆందోళనకు దిగారు. తమను వ్యాపారం సక్రమంగా జరుగకుండా తోపుడు బండ్లను మూత్రశాలల వైపు పెట్టిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఆదివారం గంజ్ లో గడియారం స్తంబం ఎదుట నిరసన చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మార్కెట్ యార్డులో డబ్బులు వసూల్ చేస్తూ ఇవ్వని వారిని వేదింపులకు గురి చేస్తున్నారని మజ్లీస్ నాయకులు ఆరోపించారు. గడియారం స్తంబం చుట్టు జరిగే పండ్ల వ్యాపారాన్ని పక్కకు జరిపించడం వల్ల వ్యాపారులు నష్టపోతున్నారని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయాజ్ మండిపడ్డారు.

 

Down with the Market Committee Chairman!

 

రోజువారిగా పండ్లు అమ్ముకుంటే కానీ పొట్టగడవని తోపుడు బండ్ల వ్యాపారులను మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డుల చేత వేదింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సంవత్సరాలుగా గడియారం స్తంబం చుట్టు జరిగే దందాను పక్కకు జరుపడం వల్ల కనీసం తోపుడు బండ్ల అద్దెలు కూడా మిగలడం లేదని అన్నారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం ఇష్టారీతిన వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తోపుడు బండ్ల వ్యాపారాన్ని అడ్డుకోవడం వెనుక చైర్మన్, పాలకవర్గం ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసనలో నగర అధ్యక్షులు షకీల్, కార్పొరేటర్ అమర్, షాబాజ్ తదితరులున్నారు.