మాక్లూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా (ఏ ) గ్రామంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన జీలకర్ర ప్రసాద్ పలు చోరీ కేసులలో నిందితుడు. జీలకర్ర ప్రసాద్ అతని స్నేహితుడు ఆదివారం రాత్రి మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో తనకు పరిచయం ఉన్న మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ మహిళ సంబంధీకులకు జీలకర్ర ప్రసాద్ కు మధ్య గొడవ జరిగింది. దీంతో రాడ్లు కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తో పాటు మాక్లుర్ ఎస్ఐ రాజశేఖర్ లు పరిశీలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా లేక మరేదైనా అనే అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీలకర్ర ప్రసాద్ పై చోరీ కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నాయి. గతంలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపగా ఎస్కార్ట్ కళ్లు గప్పి పరారీ అయ్యాడు. ఈ కారణంగా ఇద్దరు పోలీసులు కూడా సస్పెన్షన్ గురయ్యారు. నగరంలో మోస్ట్ వాంటెడ్ దొంగగా ప్రసిద్ధి చెందిన జీలకర్ర ప్రసాద్ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది.
