- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి రామారెడ్డి ఆసుపత్రిలో ఉన్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం దేమే కలాన్ లో ప్రబలిన అతిసార వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామస్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది తగిన ముందుగా చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విధుల పట్ల అలసత్వం గానీ, అశ్రద్ధ వహించిన సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సురేష్ సరిగ్గా అందుబాటులో ఉండడం లేదని కొందరు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో షోకాజ్ నోటీస్ జారీ చేయామని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్, మండల ప్రత్యేక అధికారి, ఇతర రెవెన్యూ శాఖ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
