. . . ఏఎస్ఐ నర్సింగ్ రావు
రాజంపేట, బతుకమ్మ :
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని ఏఎస్ఐ నర్సింగరావు సూచించారు. రాజంపేట కస్తూరిబా బాలికల విద్యాలయంలో సోమవారం ప్రేమలు – మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరుగుతున్న నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర సామాజిక అంశాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సూచనలతో, ఏఎస్ఐ నర్సింగరావు ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు 1930 టోల్ఫ్రీ నంబర్కు, మాదక ద్రవ్యాల సంబంధిత సమాచారానికి 1908 టోల్ఫ్రీ నంబర్కు సంప్రదించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్ నంబర్ 8712686094 కు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112 కు కాల్ చేయాలని అవగాహన కల్పించారు. విద్యార్థినులు మంచి లక్ష్యంతో చదువుపై దృష్టి సారించాలని, చిన్నపాటి పొరపాట్లు కూడా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు పాటిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.యు. శేషరావు, పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా విద్యార్థినులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యురాలు డబ్ల్యూపీసీ సౌజన్య, బ్లూ కోట్స్ పీసీ స్వామిగౌడ్, హెచ్జీ పూల్సింగ్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.
