Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:42 pm Posted by : ramakrishna

చిన్న కాంట్రాక్టర్లను వేధించొద్దు

 

. . . గనుల శాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టి, మెటల్ వంటి నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో చిన్న, నిజాయితీగల కాంట్రాక్టర్లను గనుల శాఖ అధికారులు వేధించవద్దని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అక్రమ మైనింగ్‌ను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన అధికారులు, ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్న కాంట్రాక్టర్లపై మెటీరియల్ విలువ కంటే పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడం సమంజసం కాదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. నిజాయితీగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు కలిగించే విధానాలకు ముగింపు పలకాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎఎం) కింద రాష్ట్రంలో చేపట్టిన నాణ్యమైన రహదారుల నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి, తెలంగాణ గనులు మరియు ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ బి.వి. రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Do not harass small contractors.