నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిని డీఎంఈ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ సందర్శించారు. గురువారం ఉదయం డీఎంఈతో పాటు టీజీ ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ దేవేందర్ ఆధ్వర్యంలోని టీం జీజీహెచ్ ను సందర్శించింది. డిసెంబర్ లో జిల్లా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన సందర్భంగా మరమ్మతుల అంశంపై పరిశీలన చేయాలని ఆదేశించారు. 750 పడకల ఆస్పత్రిలో మరమ్మతుల కోసం రూ.3 కోట్ల వరకు నిధుల విడుదలైనట్లు తెలిసింది. అందులో భాగంగా డీఎంఈతో పాటు చీఫ్ ఇంజినీర్ లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక సమర్పించుటకు పర్యటించారు. వారికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శివ కుమార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.