Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 4:15 pm Posted by : ramakrishna

పైసా ఖర్చు లేకుండా ప్రజలకు న్యాయ సేవే డీఎల్ఎస్ఏ లక్ష్యం

  • గ్రామాల్లో యువత సన్మార్గంలో నడవాలి
  • ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దు
  • డ్రగ్స్ నిర్మూలనను అందరూ భాద్యతగా తీసుకోవాలి
  • సీనియర్ సివిల్ జడ్జీ ఉదయ్ భాస్కర్

 

వేల్పూర్, బతుకమ్మ : సంవత్సర ఆదాయం రూ. 3లక్షల పరిమితి ఉన్న అన్ని వర్గాల భాధిత ప్రజలకు, మహిళలకు, మైనార్లకు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీ ఎల్ ఎస్ ఏ) పైసా ఖర్చు లేకుండా న్యాయ సేవలను అందిస్తుందని డీ ఎల్ ఎస్ ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఇటీవలే వీడీసిని రద్దు చేసిన మండలంలోని రామన్నపేట్ గ్రామంలో డిఎల్ ఎస్ ఏ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.ఏ సమస్య ఉన్న తెల్ల కాగితం పై దరఖాస్తూ వ్రాసి ఇస్తే చాలు భాధితులకు ఎలాంటి ఫీజు లేకుండా లాయర్ ను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.ముఖ్యంగా ఈ ఆర్మూర్ డివిజన్ లో మూడు ప్రధాన సమస్యలున్నాయని అన్నారు. ఇందులో వీడీసీల నియంత్రత్వ పాలన, డ్రగ్స్, మూఢనమ్మకాలని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా విల్లెజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట చట్టాన్ని చేతిలోకి తీసుకొని, సామాజిక బహిష్కరణలకు పాల్పడుతున్నాయని, సాంఘిక బహిష్కరణ చట్ట విరుద్ధమన్నారు. ఈలాంటి నిర్ణయాల కారణంగా విడీసీ లకు శిక్ష తప్పదని, అందుకే గ్రామంలోని ప్రజలు అందరు కలిసిమెలసి జీవించాలన్నారు. తను ఇక్కడికొచ్చి 4 నెలలు గడుస్తుందని ఈ కాలంలో ఈ ప్రాంతంలో మరో ప్రధాన సమస్య యువత డ్రగ్స్ వినియోగమన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో డ్రగ్స్ దుకాణాల్లో, పాన్ షాప్ ల్లో చాక్లేట్, సిగరెట్ ఇలా అనేక రకాలుగా తయారు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. అందుకే గ్రామాల్లోని అన్ని దుకాణలపై నిఘా వేయాలని సూచించారు. డ్రగ్స్ నిర్ములనను గ్రామాల్లోని ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని, తమ తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఓ కన్ను వేసి ఉంచాలన్నారు. డ్రగ్స్ అలవాటు పడ్డ యువకులకు వావి వర్సలు లేక పోగా సైకోలుగా మారి చేసే చేస్టల కారణంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి కొడుకులను, తమ్ములను అన్నలను చంపుకోలేక ఏం చేయాలో తెలియక వారి కుటుంబ సభ్యులు నానా వ్యతలు పడుతున్నారని అన్నారు.డ్రగ్స్ వినియోగిస్తూ, వాడుతూ ఎవరైనా పట్టుబడితే స్థానిక లీడర్లు పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పిస్తున్నారని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని రక్షించడం కూడా తప్పేనాని వాళ్ళు కూడా శిక్ష అర్హులేనన్నారు. దీనితో పాటు కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాలు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. ఆరోగ్యం బాగులేకపోతే బొట్టు పెడితే రూ. 3వేలు, తాయిత్తు కడితే రూ. 5వేలు వసూలు చేస్తూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ వెళ్లాలని, ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మితే ఆర్ధిక నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణనష్టం జరుగుతుందన్నారు. ఈ డి ఏల్ ఎస్ ఏ ద్వారా మర్డర్, మానభంగం లాంటి కేసులకు నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డీ ఎల్ ఎస్ ఏ ను ఆశ్రయించిన భాధితులకు ఇమ్మిడియట్ రిలీఫ్ ఉంటుందని, దరఖాస్తూ ఇచ్చిన నెల రోజుల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు. కొన్ని కేసులను దరఖాస్తూ లేకుండా పత్రిక ప్రకటనలను చూసి కొన్ని కేసులను డీ ఏల్ ఎస్ ఏ సుమోటాగా తీసుకొని కేసులు చేసి పరిష్కారం చేస్తుందని ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ లాయర్లు బాస రాజేశ్వర్, ఆశా నారాయణ, ఎస్సై రాము, అసిస్టెంట్ ప్రొఫెషర్ బట్టు శ్రీధర్,స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, సెక్రటరీ రమేష్, కారోబార్ మహేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

DLSA's goal is to provide legal services to the public without costing a penny.