కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ పద్దతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన 32 మంది హోం గార్డ్స్ తో పాటు జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముగ్గురు హోం గార్డులను బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి హోం గార్డుతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి విల్లింగ్, సీనియారిటి, స్పాస్ ప్రాధాన్యత, ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను పరిగణనలోకి తీసుకుని పూర్తిగా పారదర్శకంగా కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోం గార్డ్స్ అందరూ క్రమశిక్షణ తో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్ లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిబద్దత, నిజాయితీ, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.నరసింహ రెడ్డి, ఆర్ఐలు సంతోష్, నవీన్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
