Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 5:32 pm Posted by : ramakrishna

ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయం

  • జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్
  • యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అభినందన సభ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్ లో గత నెల 16వ తేదీన నిర్వహించిన పదవ తరగతి ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై మాట్లాడారు. యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం  విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ ప్రతిభా పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందరూ కూడా రానున్న పదవ తరగతి పరీక్షల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. రానున్న పదవ తరగతి బోర్డు పరీక్షలను ప్రశాంతత వాతావరణంలో రాయాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకు మొదటి మెట్టుగా ఈ పదవ తరగతి ఉపయోగపడుతుందని కాబట్టి విద్యార్థులందరూ ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని తెలియజేశారు. మాజీ విద్యార్థి సంఘ నాయకులు, అడ్వకేట్ అన్వేష్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలే కాకుండా ఇలాంటి ప్రతిభా పరీక్షలు కూడా నిర్వహించి విద్యార్థులని ఎప్పుడు ప్రోత్సహించడం జరుగుతుందని అందులో యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం చురుకైన పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి మాట్లాడుతూ గత నెల 16వ తేదీన నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,000 మంది విద్యార్థులతో యూఎస్ఎఫ్ఐ ప్రతిభా పరీక్షను నిర్వహించడం జరిగిందని ఆ పరీక్షల్లో  వివిధ స్కూల్స్ నుండి దాదాపు 40 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతికి ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ అధ్యయనం,ఐక్యత,పోరాటం అనే నినాదాలతో విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు నిర్వహిస్తూనే, విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడం కోసం, సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, మానసిక ఉల్లాసాన్ని కల్పించడం కోసం అవగాహన సదస్సులు, ప్రతిభ పరీక్షలు, క్రీడలు,వ్యాసరచన పోటీలు, మహనీయుల జీవిత చరిత్రల పై సెమినార్లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు గణేష్ పోషమైన మహేష్ మరియు యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దుర్గా,వేణు,బాబురావు తదితరులు పాల్గొన్నారు.

District Education Officer Ashok