Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 6:58 pm Posted by : ramakrishna

ఆరోగ్య, విద్యా రంగాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి      

  • ఆకస్మిక తనిఖీలతో మండల అధికారులలో వణుకు.
  • మాక్లూర్ పీహెచ్‌సీ,  గురుకుల పాఠశాల తనిఖీ

 

మాక్లూర్, బతుకమ్మ : జిల్లాలో విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా? ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా? అన్న విషయాలను పర్యవేక్షించేందుకు ఆయన ఏ సమయంలోనైనా గ్రామాల్లోని ఆసుపత్రులు, హాస్టళ్లు, పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తు ఇటు మండల అధికారుల లో జవాబుదారీ తనం వచ్చే విధంగా కృషి చేస్తు అటు ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి,  పాఠశాల, హాస్టల్ ల పట్ల నమ్మకం కుదిరే విధంగా విశేష కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో హాస్టల్ లో విద్యార్థులతో కలిసి నిద్ర పోతున్నారు.

  • మాక్లూర్  పీహెచ్‌సీ అకస్మిక తనిఖీ..

మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల సరఫరా, రక్తపరీక్షలు, డయాబెటిస్ స్క్రీనింగ్ తదితర విషయాలను నిశితంగా  పరిశీలించారు. పీహెచ్‌సీ రిజిస్టర్లను ఓపికగా పరిశీలించి, అవసరమైన మార్పులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. వాక్సినేషన్ రూమ్‌లో నిల్వ ఉన్న వ్యాక్సిన్లు, ఔషధాల నిల్వలపై ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, రోగులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

  • గిరిజన గురుకుల పాఠశాల సందర్శన..

అక్కడి నుండి ఎలియా తండాలోని గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. కొత్త బియ్యం మృదువుగా మారుతోందన్న ఫిర్యాదుపై సంబంధిత అధికారులతో మాట్లాడి, నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని  ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా? నిల్వ ఉన్న కూరగాయలు, నూనె, మసాలా పదార్థాలు తగిన నాణ్యతలో ఉన్నాయా? అన్న విషయాలను వాకబు చేసారు.  భోజన నాణ్యతపై  రాజీ పడేది లేదని  హెచ్చరించారు.

  • అధికారులకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన సంకేతం..

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అకస్మిక తనిఖీల్లో రాజీ పడడం లేదు. ఏ సమయంలోనైనా తనిఖీకి వచ్చే అవకాశం ఉండటంతో ఆసుపత్రుల్లోనూ, హాస్టళ్లలోనూ అధికారులు అందుబాటులో వుంటున్నారు.  ఈ తనిఖీల్లో మాక్లూర్ డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, గురుకుల పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ విద్యారాణి తదితరులు పాల్గొన్నారు.

District Collector's special focus on health and education sectors