. . . 178 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత
. . . తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి అర్హుడు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన మొత్తం 178 మంది లబ్ధిదారులకు రూ. 1,78,20,648/- విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజా పాలన పారదర్శకంగా కొనసాగుతోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, మహమ్మద్ ఏజాస్, మోహన్ నాయక్, ఎ.ఎం.సి. చైర్మన్ శ్యామల, గోపాల్ రెడ్డి, వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
