. . . నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మైనారిటీ , నిరుపేద మహిళలు కుట్టుపని ద్వారా స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని చేపట్టిందని నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద మంగళవారం నిజామాబాద్ జిల్లాలో అర్హులైన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ,నగర మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.1.02 కోట్ల వ్యయంతో 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుండగా అందులో కేవలం నిజామాబాద్ అర్బన్ (పట్టణ) నియోజకవర్గానికి 500 కుట్టు మిషన్లను కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు అందించారన్నారు. ఈ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ పొందాలనుకునే మహిళలు ఆన్లైన్ పోర్టల్ (tgobmms.cgg.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. కుట్టుపనిలో శిక్షణ పొందిన సర్టిఫికేట్ (ట్రైనింగ్ సర్టిఫికేట్) తప్పనిసరి అని, వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ ఉన్నవారే అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోజన్న, కరీం, కోఆప్షన్ సభ్యలు నరేంధర్ సింగ్, ఖైసర్, అంతరెడ్డి విజయపాల్ తదితరులు పాల్గొన్నారు.