ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన సదాశివనగర్, రాజంపేట్, రామారెడ్డి, తడ్వాయి మండలాల నుంచి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆదివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య రంగంలో అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయం. ఇప్పటి వరకు అత్యధికంగా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులు పంపిణీ చేయడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గర్వంగా చెప్పగలగడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ప్రభుత్వంచే అందే సహాయం ప్రతి ఒక్కరికి సమర్థంగా అందేలా, ప్రత్యేకంగా నియమించబడిన టీమ్ 24/7 పని చేస్తోంది అని వెల్లడించారు. వైద్య అవసరాలకు ఎవరైనా సాయం కావాలంటే, ఎల్లప్పుడూ తన సహాయం అందుబాటులో ఉంటుంది అని హామీ ఇచ్చారు. “ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సహాయ పథకాలు ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా మారుతున్నాయి. అవసరమైన ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో, సరైన విధంగా సహాయం అందించడమే మా బాధ్యతగా భావిస్తున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
