Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2024, 5:25 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయి

  • ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30 వేలు బాకీ పడింది
  • రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి
  • విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • మెదక్ చర్చిని సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, బతుకమ్మ : క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం మెదక్ చర్చిని సందర్శించారు. ఈ సదర్భంగా విలేకరులతో మాట్లాడారు. సీఎస్ఐతో తనకు ప్రత్యేకమైన బంధం ఉందని, వారి ఆహ్వానం మేరకు ఇక్కడకు రావడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయన్నారు. మహిళలకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తారని మహిళలు ఆశించారని అన్నారు. కానీ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30 వేలు బాకీ పడిందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్యూటీ ఇవ్వలేదని, తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలను నమ్మించి రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. నేర రేటు పెరగడం ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. మహిళలు చూస్తూ ఊరుకోరని.. కచ్చితంగా ప్రశ్నిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టిందని, తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదని అన్నారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం… ఇప్పుడు కేవలం సన్న వడ్లకే పరిమితం చేసిందని తెలిపారు. మాట మార్చడం తప్పా ప్రభుత్వంలో ఏం కనిపించడం లేదని అన్నారు.  మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలను మద్ధతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా ఏ ఒక్క పంటకు మద్ధతు ధర ఇవ్వడం లేదని అన్నారు. చెక్కెర ఫ్యాక్టరీ లను ఎప్పుడు తెరిపిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తక్షణమే రేషన్ కార్డులను, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి అని తెలిపారు. బీఆర్ఎస్ కేసీఆర్ కు క్రైస్తవులకు పేగుబంధం ఉందని, తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదని అన్నారు. మత సహనానికి నిదర్శనం మెదక్ అని తెలిపారు. మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ గోదావరి జలాలతో సింగూరును నింపారని తెలిపారు. మెదక్ కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేడయం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Distribution of Christmas gift, Ramzan tofa and Bathukamma sarees were blown up during the Congress rule