Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:31 pm Posted by : ramakrishna

జగిత్యాల జిల్లా పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు

 

. . . నగదు రివార్డు ప్రకటింపు

జగిత్యాల, బతుకమ్మ :

 

విధి నిర్వహణలో చూపిన అప్రమత్తత, వేగవంతమైన స్పందనతో ఓ మహిళ ప్రాణాలను కాపాడిన మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ అన్వర్ బేగ్, కానిస్టేబుల్ ప్రసాద్ సేవలను తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నత స్థాయిలో గుర్తించింది. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఇద్దరు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు రివార్డు ప్రకటించారు. వారి సమయస్ఫూర్తి, మానవీయ దృక్పథం, విధి పట్ల నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల అత్యున్నత బాధ్యత అని పేర్కొన్న డీజీపీ, అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి వేగవంతమైన స్పందన ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ఘటన 2026 జూన్ 18న మెట్‌పల్లి పట్టణంలోని బీడీ కాలనీ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఎస్ఆర్ఎస్పి కాలువ వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డయల్ – 112 ద్వారా సమాచారం అందిన వెంటనే మెట్‌పల్లి పోలీసులు తక్షణమే స్పందించారు. కేవలం 15 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ అన్వర్ బేగ్, కానిస్టేబుల్ ప్రసాద్ పరిస్థితిని అంచనా వేసి చాకచక్యంగా వ్యవహరించి మహిళను కాపాడారు. తదుపరి ఆమెను సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం దంపతుల మధ్య ఉన్న కుటుంబ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

DGP CV Anand praises Jagtial district police.