. . . భౌగోళిక పరిస్థితుల కారణంగా నీటిని ఎత్తిపోయాల్సిందే
. . . కన్నెపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించిన కేటీఆర్
మహాదేవ్ పూర్, బతుకమ్మ :
తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ఉన్నప్పటికీ నీటి లభ్యత సరిగా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి కన్నేపల్లి పంప్హౌస్ పరిశీలన కోసం బయలుదేరిన తమ పర్యటనను కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ చోట్ల అడ్డుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఆదివారం కన్నేపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితుల కారణంగా నీటిని ఎత్తిపోసే అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో నీటి తరలింపులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు.

జల ప్రాజెక్టులు, నీటి సమస్యలపై వ్యాఖ్యలు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ ఇది తక్కువ సమయంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మూడు బ్యారేజీలు 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, సుమారు 1531 కి.మీ కాలువలతో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడిందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన లోపాలను ప్రస్తావిస్తూ, మరమ్మతుల విషయంలో ఆలస్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఎత్తిపోసే విధానం తెలంగాణ వ్యవసాయానికి కీలకమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర నీటి ప్రాజెక్టుల పూర్తి కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు.

నీటి నిర్వహణలో కాంగ్రెస్ విఫలమైందని, రైతులకు తగిన మద్దతు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ తాగునీటి సమస్యలు, ట్యాంకర్ల పెరుగుదల వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో సాగునీటి, విద్యుత్, రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం బీమా వంటి పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, కొప్పుల ఈశ్వర్ లతో పాటు ఎంపీ వడ్డెరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
