. . . కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొక్కవోని దీక్షతో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తులకు అవకాశం లేకుండా పారదర్శకంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనకు ప్రస్తుత ప్రజా పాలనకు స్పష్టమైన తేడా ఉందని, సన్నబియ్యం పంపిణీతో పాటు నియోజకవర్గంలో అర్హులకు 3500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తున్నామన్నారు.
కళ్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలి : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చడం లేదని అన్నారు. కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం రూ.5.91 కోట్ల విలువ గల 591 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
