Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 7:56 pm Posted by : ramakrishna

బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

 

. . . ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు పోరాటం కొనసాగుతుంది

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకుండా పరిరక్షించాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో తగిన సిబ్బంది కొరత, పెరుగుతున్న పని ఒత్తిడి, భద్రతా సమస్యలు, మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, బ్యాంకుల విలీనాలతో ఉద్యోగులపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన పెన్షన్ విధానం  ఉద్యోగులకు నష్టం కలిగిస్తోందని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే డీఏ, పింఛన్ సవరణలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులలో పారదర్శకత కల్పించాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలు అవలంబిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపరుస్తోందని ఆరోపించారు. బ్యాంకు ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.