Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 4:48 pm Posted by : ramakrishna

ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

 

. . . ఈనెల 30న కళాశాలల బంద్ విజయవంతం చేయాలి

 

. . . జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కళాశాలల ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఈనెల 30న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. బకాయిలు విడుదల చేయకుండా కళాశాలల యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేస్తామని హెచ్చరించడం సమంజసం కాదని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వం‌కు బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిక జారీ చేసిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు శేఖర్, జనార్దన్, శ్రీను, అరవింద్, కిరణ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Demand for release of fee reimbursement arrears