కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు పరువు నష్టం దావా నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది సుమంత్ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. గత ఫిబ్రవరి 17, 21 న జరిగిన మీడియా సమావేశాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్పై రేప్ కేసు ఉందని, అనుచిత వ్యాఖ్యలు, అవాస్తవాలు మాట్లాడారన్నారు. ఈ విషయమై తనపై అసత్య ఆరోపణలు చేశాడని, అవాస్తవాలు మాట్లాడి తనకు పరువుకు నష్టం కలిగించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇలియాస్ కోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో కోర్టు ఫిర్యాదు పూర్వపరాలను పరిశీలించి క్రిమినల్ డిఫమేషన్ కింద ఈ నెల 20 న కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసిందన్నారు. సమావేశంలో స్థానిక న్యాయవాదులు సతీష్, స్టీఫెన్ పాల్గొన్నారు.