Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 7:04 pm Posted by : ramakrishna

ఉత్తర తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి

 

. . . రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరిన ఎంపీ అర్వింద్ 

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని అంశాలు ఇంకా నిర్ణయాలు ఆలస్యమవుతున్ననేపథ్యంలో ఆయన మరోసారి సోమవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి పెండింగ్ పనులను దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జంక్షన్‌లో పిట్ లైన్, కోచింగ్ డిపో ఏర్పాటు, పలు రైళ్ల పొడగింపులు  అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు ఆమోదం వంటి అంశాలు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని వీటికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. నవీపేట్, ఇందల్వాయి వద్ద అదనంగా ఆర్ ఓబిలు, డిచ్ పల్లి, అమ్మక్కపేట వద్ద ఆర్ యు బి ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. జానకంపేట్ వద్ద ఆర్ యు బి విస్తరణ చేపట్టాలని తెలిపారు. నిజామాబాద్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి రైళ్లు, నిజామాబాద్ మీదుగా వందేభారత్ ట్రైన్లను రైళ్ల పొడిగింపును త్వరితగతిన అమలు చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంపీ అర్వింద్ రైల్వే మంత్రి ని కోరారు. కాగా తాము కోరినట్టుగా ఎడపల్లి వద్ద ఆర్ ఓ బి నిర్మాణం, డిచ్ పల్లి లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు, ఆర్మూర్ -ఆదిలాబాద్ రైల్వే లైన్ పనుల మంజూరు పట్ల ఆయన రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.