హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది. గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422 కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.