Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 7:38 pm Posted by : ramakrishna

జీవితాంతం ప్రజల కోసం పని చేసిన త్యాగశీలి డివి. కృష్ణ

 

. . . సీపీఐ ఎంఎల్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్

 

. . . ఆర్మూర్‌లో డివి. కృష్ణ వర్ధంతి సభ

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

విప్లవోద్యమ కార్యశీలి, మార్గదర్శి అమరుడు కామ్రేడ్ డివి. కృష్ణ జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన గొప్ప త్యాగశీలి అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ సమీపంలో ఉన్న కామ్రేడ్ డివి. కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు ఎర్రజెండాను జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్ధంతి సభకు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవరాం అధ్యక్షత వహించారు. సభలో వి. ప్రభాకర్ మాట్లాడుతూ.. గుంటూరు నుంచి ఇందూరుకు వచ్చి గ్రామ గ్రామాన విప్లవోద్యమాన్ని విస్తరించేందుకు డివి. కృష్ణ కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి ఉద్యమానికే అంకితమైన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన వీరయోధుడిగా డివి. కృష్ణ నిలిచారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది సహచరులు బూటకపు ఎన్‌కౌంటర్లలో అమరులైనప్పటికీ, ఆయన ధైర్యంగా నిలబడి పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించారని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని డివి. కృష్ణ పోరాడారని చెప్పారు. పల్లెల్లో బానిసత్వం, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించి భూములను ప్రజలకు పంచిన నాయకుడని గుర్తు చేశారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజనులను సంఘటితం చేసి ప్రజా సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. జిల్లాలో బీడీ కార్మికుల నిరక్షరాస్యతను తొలగించేందుకు రాత్రి పాఠశాలలు నిర్వహించి, కార్మిక పోరాటాలు నిర్మించి కార్మిక సంఘాన్ని స్థాపించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పటికీ, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం అంకితభావంతో కృషి చేశారని తెలిపారు. డివి. కృష్ణ స్ఫూర్తిని అందరూ స్వీకరించి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఆయనకు నిజమైన నివాళి అంటే ఆయన ఆశయాల సాధనకు కృషి చేయడమేనన్నారు. సభలో టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తెన్న, సీనియర్ జర్నలిస్ట్ కొంగర శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బి. దేవరాం, ఎస్. సురేష్, జి. కిషన్, కె. రాజేశ్వర్, వి. సత్తేవ్వ, బి. కిషన్, ఎం. నరేందర్, యు. రాజన్న, జి. నడిపెన్న, జి. అరవింద్, ఎం. లక్ష్మి, జి. పద్మ, ఎన్. లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

 

D.V. Krishna was a self-sacrificing individual who dedicated his entire life to serving the people.