కామారెడ్డి, బతుకమ్మ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజంపేట శాఖలో గురువారం సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎం.రాజేష్ చంద్ర, కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, రాజంపేట సబ్-ఇన్స్పెక్టర్ బి. మహేష్ సూచనలతో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సైబర్ నేరాలపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, బ్యాంకు లేదా పోలీస్ అధికారులు ఎప్పుడూ ఓటీపీలు అడగరని వివరించారు. సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1930కు సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలపై స్పందించేందుకు షీ టీమ్ నంబర్ 972686094ను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ గౌడ్, లింగంపేట హెడ్ కానిస్టేబుల్ రమేష్, కామారెడ్డి షీ టీమ్ సభ్యురాలు భాను రెడ్డితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు.
