Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 7:07 pm Posted by : ramakrishna

తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలు పండించాలి

 

. . . వ్యవసాయ శాఖ అధికారులు

 

జుక్కల్, బతుకమ్మ :

 

తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జుక్కల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏఈఓలు పండరి, శ్రీలేఖ, రూపా, నాందేవ్, సతీష్, ప్రవీణ్, షోహెబ్ రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల యాజమాన్య పద్ధతులు, తక్కువ నీటితో సాగు చేసే విధానాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే వ్యవసాయ పద్ధతులపై రైతులకు వివరించారు. విత్తన మేళాలో కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలతో పాటు పలు రకాల విత్తనాలను ప్రదర్శించారు. ఆయా విత్తనాల వినియోగం, సాగు విధానాలు, పంటల ద్వారా వచ్చే ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.