Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 3:05 pm Posted by : ramakrishna

సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

  • బాధిత కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
  • కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎన్.దాసు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు హన్మండ్లు లు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరిందని,  వీరితోపాటు తీవ్రంగా గాయపడిన కార్మికుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలన్నిటిలో పరిశ్రమల శాఖ మిగతా సంబంధిత శాఖల సహకారంతో తనిఖీలు చేపట్టాలన్నారు. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ పని ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలన్నారు. వలస కార్మిక చట్టం అమలుపై సమీక్ష చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు, వారి కుటుంబాలకు నివాస ఇతర మౌలిక సదుపాయాలు యాజమాన్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పరిశ్రమల శాఖను డిమాండ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని, చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్కెవి జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి,  టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, కోశాధికారి సాయరెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, రఫీయుద్దీన్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జీ.భూమయ్య,  ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సహాయ కార్యదర్శి శివకుమార్ ఏఐసిసిటియు జిల్లా అధ్యక్షులు ఖాజామొయినుద్దీన్ వివిధ సంఘాల నాయకులు గణేష్, విగ్నేష్, సాయిబాబా, గంగాధర్, భారతి, సురేష్ గంగారం తదితరులు పాల్గొన్నారు.

Criminal cases should be registered against the owners of the Sigachi industry.